ఒంగోలు : రానున్న ఆర్నెల్లు సైనికుల్లా కష్ట పడండి. ఆ తర్వాత మీ బాగోగులు నేను చూసుకుంటానని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ అధ్యక్షులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు భరోసానిచ్చారు. గురువారం ఉదయం స్థానిక రిటైల్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో ఏడో డివిజన్ బూత్ కన్వినర్లు, సభ్యులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా దగ్గర పెట్టుకొని ప్రతి కుటుంబంలోని ఓటర్లను పరిశీలించాలని సూచించారు. ప్రతి ఇంటికెళ్లి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాల గురించి వివరించాలని కోరారు.
ప్రత్యేకించి గోపాల్నగర్, కమ్మపాలెం ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ మద్దతు దార్ల ఓట్లను తొలగించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని కోరారు. బూత్ కన్వినరు, సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. సమావేశంలో వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు, గంటా రామానాయుడు, తోటపల్లి సోమశేఖర్, బాచీ, డివిజన్ అధ్యక్షులు జఫ్రుల్లా, బూత్ కన్వినర్లు మీరావలి, మస్తాన్ వలి, సురేంద్ర, శ్రీకాంత్, వెంకట్రావు పాల్గొన్నారు.