• వేకువ జామునుండే హాజరైన షుగర్ బాధితులు
• 1260 మందికి ఉచిత వైద్య పరీక్షలు
• రెండు నెలలకు సరిపడు మందులు ఉచితంగా పంపిణీ
• అల్పాహారం, తాగు నీటి వసతుల ఏర్పాటు

చీరాల (DN5 News) : వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో షుగరు వ్యాధికి ఉచిత వైద్య శిభిరం ఆదివారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి షుగరు వ్యాధి బాధితులు వేకువ జాము నుండే శిభిరానికి వచ్చారు. శిభిరంలో 1260 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. అవసమైనా వారికి రెండు నెలలకు సరిపడు మందులు ఉచితంగా అందజేసినట్లు ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్ తెలిపారు. శిభిరానికి హాజరైన వారందరికి అల్పాహారం, తాగునీరు, ఇతర సహాయక ఏర్పాట్లు చేశారు. ఎక్కువ సమయం వేచి ఉంటే షుగరు వ్యాధి బాధితుల ఇబ్బందులు, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వేగంగా వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి త్వరగా పరీక్షలు చేసినట్లు తెలిపారు.

షుగరు వ్యాధి బాదితులు కేవలం మందులపైనే ఆధారపడవద్దని వైద్యులు సూచించారు. రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని చెప్పారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుకోవచ్చని చెప్పారు. ఆహారపు అలవాట్లు, ఆహారం తీసుకునే సమయంలో మార్పులు చేసు కోవాలని సూచించారు. మానసిక ఆందోళన తగ్గించు కోవాలని చెప్పారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలని చెప్పారు.

వైద్య శిభిరంలో డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్ కమలా రాజేశ్వరి, డాక్టర్ లలిత్ ప్రకాష్, డాక్టర్ పేట శ్రీకాంత్, డాక్టర్ ప్రకాష్ వైద్య పరీక్షలు చేశారు. ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, సాయి ఫణికిషోర్, చందన, కామేశ్వరరావు, ఎంజి శంకరరావు, బసవరావు, కుమార్, కె లింగరాజు, మోహన్, మిత్ర ల్యాబ్ వలి, గోపాల్, వాడరేవు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు రోగులకు ఆహారం, తాగునీటి వసతులు, సహాయక ఏర్పాట్లు చేశారు.






