కందుకూరు : టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ దుర్మరణం ఘటన తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు ఆవేదనకు గురయ్యారు. కందుకూరులో జరుగుతున్న టిడిపి శిక్షణా శిభిరంలో ఉన్న కార్యకర్తలు హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జరిగిన సంతాప సభకు శిక్షణ శిభిరం డైరెక్టర్, జెడ్పిటిసి కంచర్ల శ్రీకాంత్చౌదరి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ హరికృష్ణకు డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టమన్నారు. అన్నఎన్టిఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో చేపట్టిన చైతన్యరధయాత్ర రధాన్ని 7500కి.మీ. హరికృష్ణ ఒక్కరే నడిపారు అని అన్నారు. అంతేకాకుండా 1996లో రవాణా మంత్రిగా ఉన్న హరికృష్ణ రైతులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ట్రాక్టర్ల పై టాక్స్ను తొలగించారని చెప్పారు. మొట్టమొదటి సారిగా ఆర్టిసిలో మహిళా కండక్టర్లను నియమించిన ఘనత హరికృష్ణకే సొంతమన్నారు. ఆయన ఒక యంఎల్ఎగా, మంత్రిగా, రాజ్యసభ సబ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా అందించిన సేవలు రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి ఎంతో ఉపయోగ పడ్డాయన్నారు. రాజ్యసభలో మొట్టమొదటి సారి తెలుగులో మాట్లాడిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. హరికృష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిభిరం శిక్షకులు కాకర్ల మల్లిఖార్జున్, యర్రా సాంబశివరావు, ఉరుకుంద కో-ఆర్డినేటర్ పోకూరి రాంబాబు, కొల్లి అవినాష్ పాల్గొన్నారు.
బాపట్ల : వేగేశన ఫౌండేషన్ ఆధ్వర్యంలో టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ కార్యాలయంలో టిడిపి బాపట్ల నియోజకవర్గ నాయకులు వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ అన్న ఎన్టిఆర్ చైతన్య రధానికి చోదకునిగా పార్టీ ఆవిర్భావం నుండి వెన్నంటి ఉన్న హరికృష్ణ లేని లోటుఎవ్వరూ తీర్చలేనిదన్నారు.