హైదరాబాద్ : అత్తాపూర్లో దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది. నడిరోడ్డుపై ఫిల్లర్ నెం.145వద్ద అందరూ చూస్తుండగానే గొడ్డలితో వెంటాడి నరికి చంపారు. దాదాపు 100 మీటర్లు వెంటాడి మరి హత్య చేసిన ఘటన ఒళ్ళు గగుర్పొడిచేలా చేసింది. మృతుడు రక్షించమని ఆర్తనాధాలు పెట్టినట్లు స్థానికులు తెలిపారు. చంపేసి పారిపోతున్న దుండగులను ట్రాఫిక్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మృతుడు రమేష్ గౌడ్ గా గుర్తించారు. ఓ హత్య కేసు విషయంలో కోర్టుకు హజరై వస్తుండగా ప్రత్యర్థులు వెంబడించి అతిదారుణంగా హతమార్చారు. ఈ హత్యకు పాత కక్ష్యలే కారణంగా భావిస్తున్నారు. హత్యకు గురైన రమేష్ శంషాబాద్ ముచ్చింతల్ వద్ద జరిగిన మహేష్ గౌడ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు. ఉదయం రాజేంద్రనగర్ కోర్టుకు హజరై తిరిగి వస్తుండగా మహేష్ గౌడ్ బంధువులు మాటువేసి మరి అతిదారుణంగా హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.