రంగారెడ్డి : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పక్కనున్న రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వంటి సీఎం కావాలని, ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని అడుగుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. షాద్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కెటిఆర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మండలానికో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్షా 116 రూపాయలు ఇస్తున్నామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తామన్నారు. కులవృత్తుల రక్షణకు రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు.
ప్రగతి నివేదన సభను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని పరిష్కరిస్తామన్నారు. పాలమూరు జిల్లా సమైఖ్యపాలనలో నష్టపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఏడాదికే విద్యుత్ సమస్య అధిగమించామన్నారు. పాలమూరుకు న్యాయం చేయాలనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కష్టపడి సాగునీరు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వల్లే పాలమూరుకు దౌర్భాగ్య స్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలమూరుకు అన్యాయం చేస్తుందన్నారు. పాలమూరు అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుపడుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు దొంగ నాటకాలు మానుకోవాలన్నారు.