అమరావతి : రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విభజన చట్టంలో ఉన్నవన్నీ సాధించేవరకూ విశ్రమించేది లేదని పేర్కొన్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద గ్రీవెన్స్హాల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
విభజన హామీలు నెరవేర్చడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతన్నారు. హామీలు అమలు చేయించుకోవడంలో రెండో ఆలోచనే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చనందువల్లే పోరాట పంథాను ఎంచుకున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసం కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటామన్నారు.
ఈ నెల 27 నాటికి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతోందని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో అన్నీ చూశానన్నారు. ఐదు నదుల అనుసంధానం చేసి మహా సంగమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహా సంగమం సాకారమైతే కరవు అనేది ఉండదన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు.