– ఆందోళనకు దిగిన వరుని బంధువులు
– వరుడిని చంపబోయింది.. వధువు పెద్దమ్మ కొడుకే
– మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నఅన్నాచెల్లెలు
– పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ ప్రకారం పెళ్లికొడుకుపై దాడి
– పోలీసుల అదుపులో నిందితుడు
వరంగల్, రఘునాథపల్లి : సభ్య సమాజం తలదించుకునే సంఘటన. చెప్పుకోడానికే అసభ్యంగా ఉండే ఘటన. ఇలాంటి ఘటనలు వింటుంటే ఎటుపోతున్నామనే ఆందోళన. అలాంటి ఘటనే వరంగల్ జిల్లా రఘునాధపల్లిలో చోటు చేసుకుంది. కాబోయే పెళ్లి కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో వెలుగు చూసిన నిజాలు విస్తుగొలుపుతున్నాయి. పెళ్లికొడుకును హత్యచేసేందుకు పాల్పడింది వధువుకు స్వయంగా పెద్దమ్మ కొడుకేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వధువు, ఆమె అన్న మధ్య కొనసాగుతున్న ప్రేమ బంధంమే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
జనగామ జిల్లా కంచనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి గొంగళ్ల యాకయ్య అనే వరుడైన యువకుడిపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని విచారించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కీలకాధారాలను రాబట్టారు.
వధువు కాల్డేటాను పోలీసులు పరిశీలించారు. వరుడు యాకయ్యకు ఆమె ఎప్పుడు ఫోన్ చేసింది? అంతకు ముందు ఫోన్ ఎవరితో మాట్లాడింది ? అనే వివరాలను సేకరించారు. యాకయ్యకు ఫోన్ చేయక ముందు ఆమె పెద్దమ్మ కొడుకుతో ఫోనులో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి 11.45 గంటలకు ఐదు సార్లు యాకయ్యతో ఎందుకు మాట్లాడావని ప్రశ్నించారు. ఏం మాట్లాడావు, బయటకు ఎందుకు రమ్మన్నావు? అని తమదైన శైలీలో పోలీసులు విచారించారు. అంతే అసలు విషయం అప్పుడు బయటికొచ్చింది. తాను, తన పెద్దమ్మ కుమారుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఆ యువతి చెప్పడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోరారు. తాము ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే వరుడు యాకయ్యను హతమార్చేందుకు ప్లాన్ చేసినట్లు అంగీకరించారు.
పోలీస్ స్టేషన్ వద్ద వరుని బంధువులు, మహిళల ఆందోళన
అభంశుభం తెలియని యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని కంచనపల్లి మహిళలు, వరుని బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రెండు ట్రాక్టర్లపై దాదాపు 50 మంది మహిళలు పోలీస్ స్టేషన్కు వస్తున్న మహిళలను పోలీసులు మద్యలో కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిలో 20 మందికిపైగా మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యాకయ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై రంజిత్రావు ఎట్టకేలకు వారికి నచ్చజెప్పారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న యాకయ్యను టీఆర్ఎస్ నాయకుడు రాజారపు ప్రతాప్ పరామర్శించారు. నింధితులకు కఠినంగా శిక్షపడేలా మంత్రి కేటీఆర్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో మాట్లాడి న్యాయం చేస్తానని ప్రతాప్ తెలిపినట్లుగా యాకయ్య కుటుంబ సభ్యులు తెలిపారు.