ఇంటర్నెట్ : వింటేనే వింతగా ఉంది. కోడి గుడ్డు పెట్టడం చూశాం. కానీ ఇక్కడ మనిషి గుడ్డు పెడుతున్నాడు. అదీ అందరూ చూస్తుండగానే. అసలు ఇదెలా సాధ్యం. అది చూసిన వైద్యులు సైతం ఎలా జరుగుతోందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దక్షిణ ఇండోనేసియాకు చెందిన 14ఏళ్ల అక్మల్లో దాగిన మర్మమిదీ..! అతడు గడిచిన రెండేళ్లలో 18గుడ్లు పెట్టాడంటూ ఇంటర్నెట్లో వార్తలు హల్చల్చేస్తున్నాయి.
ఈ వార్తను అందరూ కొట్టిపారేశారు. అయితే గత సోమవారం తమ ముందే రెండు గుడ్లు పెట్టడంతో వైద్యులు నివ్వెరపోయారు. దీనిలో ఎలాంటి ఇంద్రజాలమూలేదని అక్మల్ తండ్రి రుస్లి చెబుతున్నాడు. ‘ఇదివరకు అక్మల్ పెట్టిన ఓ గుడ్డును పగులగొట్టాను. లోపల అంతా పసుపుపచ్చ సొనే ఉంది. మరొక గుడ్డును అక్మల్ తల్లి పగులగొట్టింది. దానిలో పసుపుపచ్చ సొనే లేదు. అంతా తెల్లగా ఉంది. అసలు గుడ్డును అమాంతం ఎప్పుడూ అక్మల్ మింగలేదు’అని బాలుని తండ్రి వివరించారు. మరోవైపు అక్మల్ గుడ్డును వైద్యులు పరిశీలించారు. ఇవి కోడి గుడ్లలాగే ఉన్నట్లు తేల్చారు.
ఇవి అతడి కడుపులోకి ఎలా వెళ్లాయనేది అంతుచిక్కని రహస్యం. వీటిని కావాలనే మలద్వారం గుండా శరీరంలోకి పంపించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ‘మనిషి గుడ్డు పెట్టడం అసాధ్యం. మలద్వారం గుండా అక్మల్ వీటిని శరీరంలోకి పంపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలుడిని వారం రోజులపాటు తమ పరిశీలనలో ఉంచి పరీక్షలు చేస్తే వాస్తవం బయటికి రావచ్చని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండోనేసియాలో మనిషి గుడ్డుపెట్టాడంటూ వార్తలు గతంలో కూడా వచ్చాయట. ఉత్తర జకార్తాకు చెందిన కాకెక్ సినిన్ 2015లో ఇదే విషయంతో వార్తల్లోకెక్కారట.