ముంబయి : మహాభారతాన్ని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు ఆయన గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ద్రౌపది పాత్రలో దీపిక పదుకొణెను ఎంపిక చేసుకోవాలని ఆమిర్ అనుకుంటున్నట్లు సమాచారం.
నటనలో చారిత్రక చిత్రాల్లో దీపిక ఒదిగినట్లు మరొకరు ఎవ్వరూ నటించలేరు. ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాల్లో ఆమె నటనే ఇందుకు నిదర్శనం. ద్రౌపది పాత్రకు దీపిక తప్ప ఎవ్వరూ సరిపోరనే ఆలోచనతోనే ఆమెను ఒప్పిస్తానని ఆమిర్ తన స్నేహితులతో చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో నటించేవారంతా స్టార్లే అయ్యుండాలన్నది ఆమిర్ నిర్ణయమట. అయితే దీపిక నటించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలు ఎంత వివాదాస్పదమయ్యాయో చూస్తున్నాం. ‘పద్మావత్’ చిత్రం గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను విడుదల కానివ్వబోమని దేశవ్యాప్తంగా రాజ్పుత్ కర్ణిసేన సంఘాలు ఆందోళనలు చేశాయి. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ ఏడాది జనవరిలో విడుదలై కనక వర్షం కురిపించింది. ఇలాంటి అనుభవాలు చూసిన దీపిక మరోసారి చారిత్రక నేపథ్యంలో ఉన్న సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటారా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
ముస్లం అయిన అమీర్ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తన అభిప్రాయాన్ని మీడియా ద్వారా వెల్లడించినప్పుడు ఫ్రాన్స్కు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఓ ముస్లిం మహాభారతంలో నటించడమేంటి?’ అని ట్వీట్ చేయడం దుమారం రేపింది. ఇన్ని వివాదాల నేపథ్యంలో అసలు సినిమా పట్టాలెక్కుతుందా? అన్న ప్రశ్నలు కూడా మొదలయ్యాయి.