– దర్యాప్తు పూర్తయ్యేవరకు దేశం విడిచి వెళ్లద్దని బోనీకపూర్కు సూచించిన దుబాయ్ పోలీసులు
– శ్రీదేవి భౌతికకాయం అప్పగింతపై కొనసాగుతున్న ఉత్కంఠ
– పోలీసుల ఆదీనంలో శ్రీదేవి బసచేసిన హోటల్ గది
దుబాయ్: అతిలోక సుందరి శ్రీదేవి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవి దుబాయ్లో బసచేసిన హోటల్ గదిని అక్కడి పోలీసులు ఆదీనంలోకి తీసుకున్నారు. ఆమె మరణంపై ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోయినప్పటికీ పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తుండటం, హోటల్ గదిని ఆదీనంలోకి తీసుకోవడం అనుమానాలకు తావిస్తుంది. దుబాయ్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత కేసులు అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేశారు. అనంతరం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసు కొలిక్కి వచ్చేవరకు శ్రీదేవి భర్త బోనీకపూర్ను దేశం విడిచి (దుబాయ్) వెళ్లకూడదని ఆదేశించినట్లు సమాచారం. శ్రీదేవి భౌతిక కాయాన్ని కూడా అప్పగించలేదు. సందిగ్దం కొనసాగుతూనే ఉంది.
ప్రమాద వశాత్తు శనివారం రాత్రి హోటల్గదిలోని బాత్టబ్లో మునిగి శ్రీదేవి మృతి చెందారని యూఏఈ ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత దుబాయ్ పోలీసులు మరింత లోతుగా కేసు దర్యాప్తు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తొలుత మీడియాలో గుండె పోటుతో మృతి చెందారని వార్తలు వచ్చాయి. ముంబయిలో శ్రీదేవి భౌతిక కాయం కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, బంధువుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో వైపు దుబాయ్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. శ్రీదేవి భౌతికకాయం తరలింపుపై సోమవారం ఉదయం నుంచి గంట గంటకు మారుతున్న పరిణామాలు అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురి చేశాయి.
హోటల్ గదిలో ఏం జరిగింది?
శ్రీదేవి మరణానికి ముందు ఆమె బసచేసిన హోటల్ గదిలో ఏం జరిగిందనే విషయంపై అందరూ ఆసక్తిగా ఆరాతీస్తున్నారు. నిజంగా ప్రమాదవశాత్తూ ఘటన జరిగితే దుబాయ్ పోలీసులు బోనీకపూర్ను ఎందుకు అనుమానిస్తున్నారనేది అంతుబట్టని విషయంగా మారింది. శ్రీదేవి బస చేసిన హోటల్ గదిని ఆదీనంలోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆధారాల కోసం జల్లెడపడుతున్నారు. శ్రీదేవి మృతిపై అనుమానం ఉందని ఇప్పటి వరకూ దుబాయ్ పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ అక్కడి అధికారులు మాత్రం లోతుగా దర్యాప్తు చేయడం వెనుక బలమైన కారణం ఉండొచ్చనే అనుమానాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ పోలీసులకు ఖచ్చితమైన ఆధారాలు లభిస్తేనే అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారని, ఆతర్వాతే శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబయి తరలించేందుకు అనుమతిస్తారని మరికొందరు భావిస్తున్నారు. శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ అవశేషాలు ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తుంది. అయితే శ్రీదేవికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు లేదని ఆమెతో సన్నిహితంగా ఉండే అమర్సింగ్ చెబుతున్నారు. ఈ అంశం కూడా కొంత గందరగోళానికి కారణంగా ఉంది. శ్రీదేవి భౌతికకాయం ముంబయికి ఎప్పుడొస్తుంది. కేసు ఎలాంటి మలుపు తిరుగుతోంది. ఘటన వెనుక అసలు కారణాలేంటి? అనే వివరాలు రావాలంటే మాత్రం మరి కొన్నిగంటలు వేచి చూడాల్సిందే!.