న్యూఢిల్లీ : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ పోస్టులు రాజకీయ ఊహాగానాలకు తావిస్తున్నాయి. ట్విట్టర్లో అకస్మాత్తుగా పలువురు కాంగ్రెస్ నేతలను ఫాలో అవుతున్నారు. రాజీవ్గాంధీ కాలంలో అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్లో కొనసాగిన సంగతి తెలిసిందే. కొన్ని చేదు అనుభవాల అనంతరం ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయ వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీపై ఆసక్తి కనబర్చడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమైంది.
తొలుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీని ఫాలో కావడం ప్రారంభించిన అమితాబ్ ఈ నెలలో కాంగ్రెస్ అఫిషియల్ ఖాతాతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు పీ చిదంబరం, కపిల్ సిబల్, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, జ్యోతిరాదిత్య సింథియా, సచిన్ పైలట్, సీపీ జోషిను ఫాలో అవుతున్నారు. వీళ్లతోపాటు కాంగ్రెస్ నేతలు మనీష్ తివారీ, షకీల్ అహ్మద్, సంజయ్ నిరుపమ్, రణ్దీప్ సుర్జేవాలా, ప్రియాంక చతుర్వేది, సంజయ్ ఝాలను కూడా ఆయన ట్విట్టర్లో అనుకరిస్తున్నారు.
గాంధీ – నెహ్రూ కుటుంబానికి అమితాబ్ సన్నిహితుడు. రాజీవ్గాంధీకి మిత్రుడు. ప్రస్తుతం అమితాబ్ గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తున్నారు. అమితాబ్ను ట్విట్టర్లో 3.31 కోట్లమంది అనుకరిస్తున్నారు. ఆయన 1689మంది ఫాలో అవుతున్నారు. అయితే, ఇటీవల ఫాలో అవుతున్న వారిలో కాంగ్రెస్ నేతలే అధికంగా ఉంటున్నారు. అంతేకాకుండా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా బిగ్ బీ ఫాలో అవుతున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కూతురు మిసా భారతి, జేడీయూ అధినేత నితిశ్కుమార్, సీపీఎం నేత సీతారాం ఏచూరి వంటి నేతలను ఆయన ఫాలో అవుతున్నారు. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ నేత సుప్రియా సూలేను కూడా మెగాస్టార్ ఫాలో అవుతున్నారు. ఆయన ఫాలో అవుతున్న వారిలో బీజేపీ నేతలు కూడా కొద్దిమంది ఉన్నారు. ఇటీవల నితిన్ గడ్కరీ, సురేశ్ ప్రభు వంటివారిని ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే బిగ్ బీ అకస్మాత్తుగా కాంగ్రెస్ నేతలపై ఆసక్తి కనబరుస్తుండటం మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనివెనుక ఆంతర్యం ఏదైనా ఉందా? లేక కాకతాళీయంగానే వారిని ఫాలో అవుతూ రాజకీయ అప్డేట్స్ తెలుసుకుంటున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.