అమరావతి : శాసనసభ సమావేశాలకు హాజరుకాని వైసిపి ఎమ్మెల్యేలకు జీతాలెందుకని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన టిడిపి రాష్ట్రస్థాయి వర్కుషాప్ లో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… వైసిపి పోరాడలేక పారిపోయిన పార్టీ అని ఆరోపించారు. అసెంబ్లీకి రానివారు ఎమ్మెల్యేలుగా ఉండటం ఎందుకు అని ప్రశ్నించారు. బాధ్యత మరిచిన వైసిపి ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం దేనికని అన్నారు.
‘‘రాజధానికిప్పుడే ఒక రూపు వస్తోంది. 15 ఏళ్లలోనే పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. అమరావతి బాండ్లకు గంటన్నర వ్యవధిలో రూ.2వేల కోట్లు వచ్చాయి. ప్రజలకు మనపై నమ్మకం ఉందనేందుకు నిదర్శనం. కేంద్రం ఏపీకి నిధులివ్వకుండా పీడీ ఖాతాలపై విమర్శలు చేస్తోంది. కేంద్రం విమర్శలకు గట్టి సమాధానమివ్వాలి. మన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ చేశాం. తెలంగాణ కేంద్రంతో సఖ్యతగా ఉంటే అన్నీ ఇస్తున్నారు. ఏపీ విషయంలో మాత్రం కేంద్రం కక్ష గట్టి వ్యవహరిస్తోంది’’ అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.