చీరాల : ఒంగోలులో పద్మావతి ఫంక్షన్ హాలులో మే 4న ఆదివారం జరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగుల, సాంస్కృతిక, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వివాహ పరిచయ వేదిక వినియోగించుకోవాలని హైమా హాస్పిటల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, కామాక్షి కేర్ హాస్పిటల్ డాక్టర్ తాడివలస దేవరాజు కోరారు. స్థానిక హైమ హాస్పిటల్ ఆవరణలో ఉచిత వివాహ వేదిక కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా మూడు వేల మందికిపైగా ఉచితంగా వివాహ వేదిక ద్వారా వివాహాలు చేసినటువంటి వివాహ పరిచయ వేదిక నిర్వాహకులను అభినందించారు. నాయి బ్రాహ్మణ వధూవరుల కోసం ఎదురుచూస్తున్న తల్లి, దండ్రులు, యువతీ, యువకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివాహ వేదిక కన్వీనర్ నాదెండ్ల రాఘవ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల నుండి గత ఐదేళ్లుగా ఎంతోమంది ఈ వివాహ వేదికలో పాల్గొంటున్నారని తెలిపారు. నాయి బ్రాహ్మణ తల్లిదండ్రులకు వధూవరుల పరిచయం తమదని, నిర్ణయం మీదని తెలిపారు. కార్యక్రమంలో పోతకమూరి మధుబాబు, మార్కాపూరాం వెంకట రామారావు పాల్గొన్నారు.