డిల్లీ: కాంగ్రెస్ పార్టీతో తన బంధం విడదీయలేనిదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో ఆయన శుక్రవారం కాంగ్రెస్లో తిరిగి చేరారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతోనే గుర్తింపు వచ్చింది. నా తండ్రి నాలుగుసార్లు, నేను నాలుగుసార్లు శాసనసభ్యుడిగా గెలిచామంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే. గాంధీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం వల్లనే నేను చీఫ్ విప్, స్పీకర్, ముఖ్యమంత్రి వంటి పదవులు అనుభవించగలిగాను. నేను వైఎస్కు అత్యంత సన్నిహితుడిని. కాంగ్రెస్లోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తా. కాంగ్రెస్ వీడిన 30-40 మంది నేతలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’ అంటూ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరతాయి. ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ వల్లే సాధ్యం. పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం అపహాస్యం చేసింది. విభజన చట్టం అమల్లో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి. విభజన చట్టాన్ని రూపొందించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేసేందుకు సిద్దంగా ఉంది’ అని కిరణ్కుమార్రెడ్డి అన్నారు.