Home క్రైమ్ నిర్భ‌య ఘ‌ట‌న‌లో ముద్దాయిల‌కు ఉరే స‌రైన తీర్పు

నిర్భ‌య ఘ‌ట‌న‌లో ముద్దాయిల‌కు ఉరే స‌రైన తీర్పు

453
0

డిల్లీ : నిర్బ‌య ఘ‌ట‌న దేశం భీతిల్లేలా చేసింది. అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న దేశ‌ప్ర‌జ‌ల‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం యావ‌త్తు స్పందించి రోడ్ల‌పైకొచ్చి నిర‌స‌న తెలిపేలా చేసింది. అలాంటి ఘ‌ట‌న‌లో ముద్దాయిల‌కు ఉరి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును స‌మీక్షించాల‌ని ముగ్గురు ముద్దాయిలు పిటిష‌న్ దాఖ‌లు చేసుకున్నారు. ఈ పిటిష‌న్‌ను దేశఅత్యున్న‌త న్యాయ‌స్థానం తోసిపుచ్చింది. ఎట్టిప‌రిస్థితుల్లో ముద్దాయిల‌కు శిక్ష త‌గ్గించేదిలేద‌ని తేల్చి చెప్పింది. వారికి ఉరిశిక్షే సరైనదని స్పష్టం చేసింది.

2012 డిసెంబరు 16న దక్షిణ దిల్లీ ప్రాంతంలో తోటి విద్యార్థితో కలిసి వెళ్తున్న ఓ పారామెడికల్‌ విద్యార్థిపై ఆరుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచి వేసిన విషయం తెలిసిందే. అత్యాచారం అనంతరం ఆ యువతిని రోడ్డు మీద విసిరేసి నిందితులు వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సింగపూర్‌లో చికిత్స పొందుతూ డిసెంబరు 29 ప్రాణాలు విడిచింది.

ఈ ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా భ‌యంతో ఉలిక్కి పడింది. బాధితురాలిని నిర్భయగా పేర్కొంటూ దేశమంతా పెద్ద ఎత్తున నిర‌స‌న‌, ఆందోళనలు వెల్లువెత్తాయి. నిర్భయ దోషులకు కఠిన శిక్ష విధించాలని ప్ర‌జ‌లు నినాదాలు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన డిల్లీ పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతడిని జువైనల్‌ హోంకు తరలించారు. మూడేళ్ల శిక్ష అనంతరం అతడు‌ 2015లో విడుదలయ్యాడు.

ఇదిలా ఉండ‌గా విచారణ సమయంలో నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ 2013 మార్చి 11న పోలీస్‌ కస్టడీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబరులో మిగతా నలుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. 2017 మే 5న నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. అయితే ఈ శిక్షను సవాలు చేస్తూ దోషుల్లో ముగ్గురు ముద్దాయిలు పవన్‌, వినయ్‌, ముఖేశ్‌ సుప్రీంకోర్టులో తీర్పు స‌మీక్షా పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు విధించిన ఉరిశిక్షను తగ్గించి యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ భానుమతితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ముగ్గురికి ఉరిశిక్షే సరైనదని తేల్చింది. అయితే క్యురెటివ్‌ పిటిషన్‌ వేసేందుకు మాత్రం వారికి మ‌రో అవకాశం కల్పించింది.