చీరాల : రైతులు సాగు చేసే పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే పంటల భీమా, ప్రభుత్వ రాయితీలు వర్తిస్తాయని వ్యవసాయాధికారిణి ఇ ఫాతిమ తెలిపారు. రైతు తన పొలంలో ఏ పంట వేశాడో ఆ పంటను వ్యవసాయ శాఖ, రెవిన్యూ శాఖ అధికారుల ద్వారా పంట పూర్తి వివరాలతో ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు. నమోదు చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రభుత్వం పరిగణలోకి తీసుకోని నష్టపరిహారం ఇస్తుందన్నారు. ఇవే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టే (ఎంఎస్పి) అంటే కనీస మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పుడు మీరు వేసుకున్న ఆన్లైన్లో అనగా పంటను ఫోటో తీయించారా? లేదా? అని సంబంధిత అధికారులు పరిసలించి మీకు కొనుగోలు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారని వివరించారు.
అలా ధ్రువీకరణ పత్రం ఉంటేనే మీ పంటను కొనుగోలు కేంద్రంలో కొనగలుగుతారని చెప్పారు. నమోదు చేసుకోకుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనరని చెప్పారు. వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు మీ గ్రామానికే, మీ పొలనికే వస్తారని చెప్పారు. ప్రతిరైతు అధికారుల వెంట ఉండి మీ పంటను తగిన వివరాలతో నమోదు చేయించుకోవాలని చెప్పారు. పండ్ల తొటలు, మిరప, పూల తోటలు, కూరగాయలు సాగుచేసిన రైతు సోదరులు “ఉద్యానశాఖ అధికారుల“తో నమోదు చేసుకోవాలని సూచించారు. కంది, మినుము, పెసర, వరి వంటి పంటలను మాత్రం వ్యవసాయశాఖ అధికారులు, రెవిన్యూ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని చెప్పారు.
రైతు ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, సర్వే నెంబర్, వేసిన పంట ఫోటోతో రైతులు ఆన్లైన్ నమోదు చేసుకోవాలని చెప్పారు. రేపటి నుంచే అనగా శుక్రవారం నుండి మీ గ్రామాల్లో పంట నమోదు కార్యక్రమం మొదలవుతందని తెలిపారు. రైతులు సకాలంలో అందుబాటులో లేకుంటే మీకు సంబందించిన వారికి మీ యొక్క పూర్తి వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలని చెప్పారు.