అమరావతి : టిడిపి – వైసిపి మద్య ఎన్టిఆర్ పేరు చిచ్చు రేపింది. వైసిపి అధినేత వైఎస్ జగన్ కృష్ణజిల్లా నిమ్మకూరులో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు. ఎన్టిఆర్ సొతగ్రామమైన నిమ్మకూరులో జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో ఎన్టిఆర్ సోదరుడు నందమూరి వెంకటేశ్వర్లు కలిశారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను అధికారానికి వస్తే కృష్ణజిల్లాకు ఎన్టిఆర్ పేరు పెడతానని ప్రకటించారు. దీనిపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి నేతల మద్య మాటల యుద్దం రేపింది. జగన్ వ్యాఖ్యలపై విజయవాడ ఎంపి కేసినేని నాని మాట్లాడారు. ఎన్టిఆర్ పేరు ప్రస్తావించే అర్హత కూడా జగన్కు లేదని జగన్పై విమర్శనాస్ర్తాలు సంధించారు.
వైసిపి నిర్వహిస్తున్న వంచన వ్యతిరేక దీక్షలో పాల్గొన్న ఎన్టిఆర్ సతీమణి లక్ష్మిపార్వతి ప్రతిస్పందించారు. ఎన్టిఆర్ రక్తం పంచుకున్న పిల్లలు, అధికారాన్ని అందుకున్న చంద్రబాబు చేయలేని పని జగన్ చేస్తాననడం అభినందనీయమని చెప్పారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా : జగన్
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో వైసిపి అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతుంది. సోమవారం ఉదయం పామర్రు నుండి ప్రారంభమైన పాదయాత్ర జుజ్జువరం, నిమ్మకూరు మీదుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిమ్మకూరులో నీరు – చెట్టు కింద తవ్విన చెరువును జగన్ పరిశీలించారు. నీరు – చెట్టు పథకం పేరుతో తెలుగు తమ్ముళ్లు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లాను నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తామని జగన్ ప్రకటించారు.