డిల్లీ : రెండు దేశాలకు చెందిన ఇద్దరు వివాహం చేసుకుంటే ఇరుదేశాలు కలుస్తాయా? విడిపోయిన రెండు కుటుంబాల్లో ఇచ్చిపుచ్చుకుంటేనే రెండు కుటుంబాల్లో సఖ్యత కుదరడంలేదు. అలాంటిది విడిపోయి ఉప్పు-నిప్పుగా ఉన్న రెండు దేశాలు కలుస్తాయా? ఇద్దరు క్రీడాకారులు ఇష్టపడి వివాహం చేసుకున్నంత మాత్రాన వాళ్లు ఇరుదేశాలకు ప్రతినిధులు అవుతారా? క్రీడలపై అభిమానంతో మంచి క్రీడాకారులుగా అభినందించినంత మాత్రాన దేశప్రజలందరికీ బంధువులు అవుతారా? ఆటల్లోనూ కార్పోరేట్ సంస్థలు జొరపబడి ఆటలను బ్రష్టుపట్టిస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు దేశంలో లేక కాదు. వాళ్లను ప్రోత్సహించేవాళ్లు లేక వాళ్ల గ్రామాలు దాటిరాని క్రీడాకారులు ఎందరున్నారో లెక్కకట్టలేం. కేడ్బాల్ పట్టుకుని చెట్టుపై పిట్టలను గురిచూసి కొట్టగల ప్రతిభావంతులకు కొదువలేని దేశం మనది. కానీ ఆర్చరీలో ఎంతమంది భాగమవుతున్నారు? కబడ్డీ, బాస్కెట్బాల్, ఫుట్బాల్తోపాటు గ్రామీణ క్రీడలు బోలెడన్ని ఉన్నాయి. వీటికేటికీ రాని ప్రచారం, ప్రాధాన్యత 11మంది క్రీడాకారులు ఆడుతుంటే లక్షల మంది వీక్షించే క్రికెట్కే ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది. క్రికెట్ ఆటలో 11మంది క్రీడాకారులు విజయం సాధిస్తే దేశమే గెలిచినంతగా ప్రచారం చేయడం, యువతలో భావోద్వేగాలు చెర్చగొట్టడం వెనుక ప్రయోజనమేంటి? ఆటలు స్నేహం, ఐక్యతను పెంచుతాయనుకుంటాం. కానీ అలాంటి ఆటలు ఇరుదేశాల మద్య భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నాయి? వీటన్నింటి వెనుక ఉన్న ప్రయోజనాలను ఇద్దరి వివాహం పరిష్కరించలేదు కదా?
భారత్-పాకిస్థాన్ దేశాలను కలపాలని తాను పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు సోయబ్మాలిక్ను వివాహం చేసుకోలేదని టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా అంటొంది. తామేదో భారత్-పాకిస్థాన్లను కలపడానికి పెళ్లి చేసుకున్నట్లు చాలా మంది అపోహపడుతున్నారని ఓపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొంది. అది నిజం కాదన్నారు. సంవత్సరానికోసారి తాను పాకిస్థాన్లోని తమ అత్తగారి కుటుంబాన్ని కలవడానికే వెళుతుంటానన్నారు. వాళ్లు తనపై అపారమైన ప్రేమ చూపిస్తారన్నారు. ఆ దేశం అంతా తనను వదిన అని సంభోదిస్తుందన్నారు. క్రికెట్ జట్టు కెప్టెన్గా తన భర్తను అక్కడి ప్రజలు అభిమానిస్తారని తెలిపారు. ఆ అభిమానమే తనపై ప్రేమగా మారిందన్నారు. షోయబ్ భారత్ వచ్చినప్పుడూ ఇక్కడి ప్రజలు అలా స్పందిస్తున్నారని చెప్పారు. అతడిపైనా ఇక్కడి ప్రజలు ప్రేమ చూపిస్తారని పేర్కొన్నారు.
ప్రస్తుత సానియా మీర్జా ఎనిమిది నెలల గర్భవతి అట. అక్టోబర్లో బిడ్డకు జన్మనివ్వవచ్చని చెబుతున్నారు. గర్భవతిగా ఉన్నప్పటికీ తాను రోజూ నాలుగైదు కిలోమీటర్లు నడుస్తున్నట్లు చెప్పారు. గర్భం దాలిస్తే కాలుతీసి కాలు వేయకూడదని, శారీరక శ్రమ చేయకూడదనే ఆలోచన సరికాదన్నారు. తాను వారానికి నాలుగుసార్లు యోగా చేస్తానని చెప్పారు. తన అమ్మ మాత్రం ఆందోళన చెందుతుంటుందని పేర్కొన్నారు. వ్యాయామం చేయవద్దని చెబుతుందట. ఎలాగోలా తనను ఒప్పిస్తున్నట్లు తెలిపారు. టెన్నిస్ మాత్రం ఆడడం లేదన్నారు. ఇంట్లోనే టెన్నిస్ కోర్టు ఉందన్నారు. తాను టెన్నిస్ కోర్టులోకి వెళితే తమ అమ్మ చంపేస్తుంది (నవ్వుతూ) అని సానియా మీర్జా చెప్పారు.