డిల్లీ: చైనా భాషకు పాకిస్తాన్లో అధికారిక గుర్తింపు ఇవ్వడంతో చైనా, పాకిస్థాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయని మరోసారి రుజువైంది. చైనా భాష అయిన మాండరీన్కు పాక్ తమ దేశంలో అధికారిక హోదా ప్రకటించింది. మాండరీన్ భాషను అధికారిక భాషగా గుర్తించేందుకు పాకిస్థాన్ సెనేట్ ఆమోదించింది. ‘గడిచిన 70ఏళ్లలో పాకిస్థాన్ నాలుగు భాషలకు అధికారిక గుర్తింపు ఇచ్చింది. స్థానిక భాషలను పక్కనబెట్టి ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్తోపాటు ఇప్పుడు చైనీస్ భాషను అధికారిక భాషగా గుర్తించింది. దేశంలో చాలా మంది ప్రజలకు అవి మాతృభాషలు కావు’ అని అమెరికాకు పాక్ రాయబారి హుస్సేన్ హక్కానీ ట్విటర్లో పేర్కొన్నారు.
పాకిస్థాన్లో 44శాతం మంది మాతృభాష పంజాబీ, 15.32శాతం మంది మాతృభాష పాష్తో, 14.5 శాతం ప్రజలు సింధి, 4శాతం మంది ప్రజలు బలోచి మాట్లాడుతారు. అయినప్పటికీ వీటిని పక్కనబెట్టి చైనాకు చెందిన మాండరీన్ను అధికారిక భాషగా గుర్తించడం ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నప్పటికీ చాలా మంది పాకిస్థానీలు మద్దతు పలకడం గమనార్హం. మాండరీన్ను నేర్చుకునేందుకు చాలా మంది పాకిస్థానీలు ఆసక్తి చూపుతున్నట్లు డాన్ పత్రిక పేర్కొంది. ఈ భాష వల్ల పాక్, చైనాలో తమకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అక్కడివారు భావిస్తున్నారట.
ఇప్పటికే చైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాక్కు సహకరిస్తూ వస్తోంది. ఆర్థికంగానూ పాక్కు వెన్నంటి ఉంటోంది. ఇందులో భాగంగానే సీపెక్ (చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్)లో నిర్మాణాలు చేపడుతోంది. తాజాగా చైనా భాషను పాక్ అధికారికంగా గుర్తించడంతో తమ మధ్య బంధం మరింత బలపడుతోందని ప్రపంచానికి పాకిస్తాన్ చెప్పకనే చెప్పింది.