చీరాల (Chirala) : ఎంఆర్పిఎస్ 30ఏళ్ల క్రితం విజయనగరకాలనీలోనే పురుడుపోసుకుందని వ్యవస్థాపకుల్లో ఒకరైన లిడ్క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు (LIDCAP Chairman Pilli Manikyarao)పేర్కొన్నారు. జులై 7 ఎంఆర్సిఎస్ (MRPS) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాలనీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (Dr.BR Ambedkar), డాక్టర్ బాబు జగజ్జీవన్రామ్ (JagajjivnRam), విశ్రాంత ఐఎఎస్ డాక్టర్ ఎస్ఆర్ శంకరన్ (SR Sankaran, IAS) విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గత 30ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉధ్యమంలో అశువులు బాసిన కార్యకర్తలకు నివాళి అర్పించారు. ఎంఆర్పిఎస్ ఉధ్యమ ఫలితాలు యావత్ భారత దేశంలోని తమ జాతి ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రత్యేకించి దక్షిణ భారత దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరుగుతుందని, కేరళలోనూ అధ్యయన కమిటీ వేశారని పేర్కొన్నారు.
1994 జులై 7న ఎంఆర్పిఎస్ చీరాల మండలం విజయనగర కాలనీలో (Chirala Vijayanagara Colony) తొలి కమిటి, ఈదుమూడిలో రెండో కమిటీ వేశామని, ఆ తర్వాద రాష్ట్రవ్యాప్తంగా ఎంఆర్పిఎస్ విస్తరించిందని అన్నారు. 30ఏళ్ల సుధీర్గ పోరాటం అనంతరం సుప్రీ కోర్టు రిజర్వేషన్ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారాలు ఇస్తూ ఇచ్చిన తీర్పు నేపధ్యంలో ఎంఆర్పిఎస్ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వాస్తవానికి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన మూడేళ్లకే విజయం సాధించిందని చెప్పారు. 1997లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా ఆర్డినెన్స్ ఇచ్చిందని చెప్పారు. ఆర్డినెన్స్పై కొందరు కోర్టును ఆశ్రయించడంతో అమలుకు నోచుకోలేదని చెప్పారు. 1999లో చంద్రబాబు సారధ్యంలో టిడిపి అధికారానికి వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ను 2004వరకు అమలు చేశారని గుర్తు చేశారు. 2004ఎన్నికల్లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ఆర్డినెన్స్ను నిలిపివేయడంతో వర్గీకరణ అమలుకు నోచుకోలేదని చెప్పారు.
ప్రస్తుతం సుప్రీం కోర్డు తీర్పు నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో వర్గీకరణ అమలు జరుగుతుందని చెప్పారు. ప్రస్తుత ఉద్యోగ, విద్యా సంస్థల్లో సీట్ల నియమకాలన్నీ వర్గీకరణ అమలు జరుగుతుందని చెప్పారు. ఎంఆర్పిఎస్ ఆవిర్భావం నుండి తాను అనేక పోరాటాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు సైకిల్ యాత్ర, బెంగులూరు నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర, ఇతర అనేక పోరాటాల్లో తాను ప్రధానంగా పనిచేశానని చెప్పారు. ఎంఆర్పిఎస్ ఉధ్యమ ఫలితం జాతి ప్రజలకు అందుతున్న నేపధ్యంలో తమ ఉధ్యమానికి మొదటి నుండి అండగా నిలబడిన తెలుగుదేశం వైపు వెళ్లేందుకే తాను రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలుగుదేశంలో క్రియాశీలకంగా లిడ్క్యాప్ ఛైర్మన్గా సేవలందించడం సంతోషంగా ఉందని చెప్పారు. తాము బీజం వేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితం తెలుగురాష్ట్రాలకే కాక దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రంల్లో తమ జాతి ప్రజలు లబ్ది పొందడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. సమావేశంలో ఉసురుపాటి సురేష్, దుడ్డు యాకోబు, తేళ్ల చిట్టిబాబు, జడ బాబురావు, తేళ్ల ప్రసాదు, తేళ్ల వంశి, తేళ్ళ లక్ష్మయ్య, ఉసురుపాటి ముసలయ్య, చుండూరు రమేష్, దుడ్డు మోషే, పిల్లి మధు, పిల్లి సుబ్బారావు, రంగి రూబేను పాల్గొన్నారు.