మెల్బోర్న్ : జన్మనిచ్చిన మాతృ భూమి రుణం తీర్చుకునేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. మెల్బోర్న్ లో ప్రవాసాంధ్రులు శనివారం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు తమవంతు చేయూతనివ్వాలని కోరారు. దీనికి సంబంధించి “కనెక్ట్ టు ఆంధ్రా” వెబ్ పోర్టల్ను సీఎం జగన్ అమరావతిలో శుక్రవారం ప్రారంభించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఆంధ్రా కుటుంబాలు తమ సొంతూళ్లలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆలంబనగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు తమవంతు సాయం అందిస్తామని ప్రవాసాంధ్రులు ముక్త కంఠంతో తమ సమ్మతిని తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రశంశల జల్లు కురిపించారు. కార్యక్రమంలో వైవీ సతీమణి స్వర్ణలతారెడ్డి, చింతలచెరువు సూర్య నారాయణరెడ్డి, కిషోర్, ప్రదీప్ బత్తుల శ్రీకాంత్ పాల్గొన్నారు.
కేంద్ర మంత్రితో మర్యాదపూర్వక భేటీ
మెల్బోర్న్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీలో చేపడుతున్న సంస్కరణల గురించి ప్రస్తావించారు. భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాల కల్పన గురించి చర్చించారు. మంత్రిని కలిసిన వారిలో టీటీడీ చైర్మన్ తోపాటు సుబ్బారెడ్డి, భవనం భార్గవ్, మోహన్, చైతన్య ఉన్నారు.