Home ఆంధ్రప్రదేశ్ ఏపీలో లాక్ డౌన్ : సీఎం జగన్

ఏపీలో లాక్ డౌన్ : సీఎం జగన్

311
0

అమరావతి, మార్చి 22 : కరోనా వైరస్ మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కఠిన నిర్ణయానికి సిద్ధపడ్డారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వెనువెంటనే సీఎం జగన్ స్పందించి ఏపీలోనూ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కొవిడ్-19 వైరస్ కట్టడి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పడానికి ఈ నిర్ణయమని పేర్కొన్నారు. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్‌డౌన్ చేస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మార్చి 31 వరకు ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు. గోడౌన్లు, ఫ్యాక్టరీలు అతి తక్కువ సిబ్బందితో నడపాలని సూచించారు.

పేదలకు ఉచితంగా రేషన్‌ ఇస్తూ, ప్రతి ఇంటికి రూ.1000 ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మార్చి 29నాటికి పూర్తిగా రేషన్‌ అందుబాటులో ఉంటుందని, రేషన్‌ ఉచితంగా ఇవ్వడమేక కాకుండా కేజీ పప్పు దినుసులను సైతం ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1000 అందిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా 14రోజులు ఇళ్లలోనే ఉండాలన్నారు. అందరూ 14రోజుల పాటు ఇళ్లలోంచి కదలొద్దని కోరారు.

అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని జగన్‌ పేర్కొన్నారు. ‘‘కరానాను ఎదుర్కొవడంలో మిగిలిన రాష్ట్రాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్రంలో 6 కేసులు మాత్రమే నమోదు కాగా, అందులో ఒక కేసు నయమయ్యిందన్నారు.

రాష్ట్రంలో 2.50లక్షలకు పైగా ఉన్న గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారని పేర్కొన్నారు. అందువల్లే పరిస్థితి చాలా వరకు అదుపులో ఉందన్నారు. ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు ఉంటే 104 నంబర్‌కు ఫోన్ చేయండి’’ అని అన్నారు.

‘‘కరోనాను కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చాం. 31వరకు సెలవులు ఇచ్చాం. పదో తరగతి పరీక్షలు యధాతథంగా జరుగుతాయి. ఇవన్నీ జరుగుతుండగానే దేశం మొత్తం మీద దీన్ని శాశ్వతంగా అరికట్టాలనే దానిపై చర్చ జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో అవగాహన పెరగాలి. ఇంకొకరికి వ్యాధి సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతిఒక్కరూ నిర్ధిష్టమైన ప్రాంతంలో ఉండగలిగితే వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చు. మనం కూడా 31వరకు సకలం బంద్‌ చేద్దాం. ఇందులో భాగంగానే మనం కూడా రవాణా వ్యవస్థను కట్టడి చేస్తాం. అందరూ కూడా సహకరించుకోవాలి. ఆటోలు, ట్యాక్సీలు కూడా తప్పనిసరి అయితేనే ఉపయోగించుకోవాలి. ఇద్దరి కంటే ఎక్కువగా ఎక్కించుకోవద్దని సూచిస్తున్నాం. గోల్డ్‌ షాపులు, బట్టల షాపులన్నీ మార్చి 31వరకు మూత వేయాలి. ఫ్యాక్టరీలు, గోడౌన్లు అవసరమైతేనే నడపండి. ప్రభుత్వం రొటేషన్‌ పద్ధతిలో ఉద్యోగులను వాడుకుంటాం’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘విదేశాల నుంచి వచ్చిన వారందరినీ కూడా అభ్యర్థిస్తున్నా హోం క్వారైంటన్‌లోకి 14రోజుల పాటు వెళ్లాలి. బయటకు రావద్దు. ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేస్తున్నారు. ఒకరికి ఒకరం అర్థం చేసుకోవాలి. అందరూ సహకరించాలని కోరుతున్నా. పబ్లిక్‌, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు కట్టడి కావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. పోలీసులకు కూడా చెబుతున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారికి కట్టడి చేయమని కోరుతున్నాం. కలెక్టర్లు అందరూ కూడా ధరలు పెరగకుండా చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార దృక్ఫథంలో వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. అధిక రేట్లకు ఎవరైనా సరుకులు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలి. టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ఇస్తారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయండి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిపివేస్తున్నాం’’ అని తెలిపారు.

నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు మినహా మిగతా అన్ని దుకాణాలను మూసివేస్తున్నట్లు జగన్ స్పష్టంచేశారు. నిత్యావసరాలు, మందుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ అమ్మరాదని, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులున్నా 104 ఫోన్ చేయాలని కోరారు. వృద్దులు, చిన్నారులు అసలు బయటకు రావద్దన్న సీఎం సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కోదాడ వద్ద ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ సరిహద్దు (హైదరాబాద్‌ – విజయవాడ హైవే)ను సైతం ఆదివారం ఉదయం మూసేశారు. మహారాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రం కావడం పెద్ద భయం. అక్కడ కోవిడ్‌–19 బాగా పెరుగుతోంది. మహారాష్ట్రతో మనకు ఐదారు వంద కిలోమీటర్ల సరిహద్దు ఉంది.

ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల ప్రజలకు మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందెడ్‌ వంటి ప్రాంతాల్లో ఎక్కువ బంధుత్వాలున్నాయి. మహారాష్ట్రలో వ్యాధి తీవ్రతపై ఒకటి రెండు రోజుల్లో సమీక్ష నిర్వహించి ఆ రాష్ట్రంతో సరిహద్దులు మూసేయాలని ఆలోచిస్తున్నామని, ఆ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు ముందుగానే చెప్పి సరిహద్దులు మూసేస్తామనీ తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ రాకుండా రాష్ట్ర సరిహద్దులను మూసేస్తామని ప్రకటించారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రధాన కార్యదర్శి, డీజీపీ నిరంతరం టచ్‌లో ఉన్నారని, ఢిల్లీతో కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.