అమరావతి : ఆపరేషన్ ఆమంచి ఫలించింది. టీడీపీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు వెంట వచ్చారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైఎస్సార్సీపీలో చేరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని సమర్థవంతమైన నేతను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే తాను పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ ఆమంచి ఒకటే కాదని భవిష్యత్తులో టీడీపీనే ఉండదని చెప్పారు.