Home ఆంధ్రప్రదేశ్ భూ పంపిణీతోనే సామాజిక న్యాయం : కెవిపిఎస్

భూ పంపిణీతోనే సామాజిక న్యాయం : కెవిపిఎస్

9
0
Oplus_16908290

చీరాల (DN5 News) : భూ పంపిణీ ద్వారానే పేదల సామాజిక సమస్యలు పరిష్కారం సాధ్యమని కెవిపిఎస్ రాష్ట్ర నాయకుడు కె లోకనాథం అన్నారు. స్థానిక అంబేద్కర్ భవనంలో కెవిపిఎస్ శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములను ల్యాండ్ అక్విజిషన్ పేరుతో స్వాధీనం చేసుకుని పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలకు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం తీవ్రంగా ఖండించాల్సిన చర్యని పేర్కొన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు వాటిని రక్షించకుండా పరిశ్రమలకు దారదత్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు.

22ఎ భూములను పరిశ్రమలకు కేటాయించే నిర్ణయాలు తీసుకోవడం పేదల జీవనాధారాన్ని దెబ్బతీసే చర్యలని పేర్కొన్నారు. భూమి లేకపోవడం వల్లే దళితులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. పేదలకు భూమి పంపిణీ చేసి సాగు చేయడానికి అవకాశాలు కల్పిస్తేనే జీవనోపాధి బలోపేతం అవుతుందని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు వారిని మరింత పేదరికంలోకి నెట్టే విధానాలు అమలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు కేటాయించిన బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో దళిత యువతకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలులో అనేక ఆటంకాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రభుత్వాలు ముందుగా 40 శాతం నిధులను కేంద్రానికి జమ చేస్తేనే నిధులు విడుదల చేస్తామని చెప్పడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితితో పేదలకు అవసరమైన ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అవుతున్నాయని విమర్శించారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించినప్పటికీ అమలులో అనేక పరిమితులు విధించడంతో ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందడం లేదన్నారు.

గ్రామాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోందని, దళితపేటల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, స్మశాన భూముల వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఒకవైపు పల్లెల్లో అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అభివృద్ధి పేరుతో పేదలకు ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

దళితపేటల్లో సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే
రాష్ట్ర వర్క్‌షాపులో కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దళితపేటల్లో సమగ్ర సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా భూమి, స్మశానాల, మౌలిక సదుపాయాల లోపాలు, వివక్ష ఘటనలు వంటి అంశాలు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించి పరిష్కారం కోరుతామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ప్రతిఘటన పోరాటాలు చేపట్టేందుకు సిద్దమని హెచ్చరించారు. దళితుల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి న్యాయం సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దళితుల భూముల రక్షణ, భూ పంపిణీ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఉపాధి హామీ పథకం బలోపేతం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కెవిపిఎస్ నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి రఘురామ్, గుండెమెడ క్రాంతికుమార్, టి తిరుపాల్, రంగమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్ జయరాజు, చిరంజీవి పాల్గొన్నారు.