Home ఆంధ్రప్రదేశ్ రామాయపట్నం పోర్టును జాతీయ పోర్టుగా ప్రకటించాలి : ఒంగోలు ఎంపీ మాగుంట

రామాయపట్నం పోర్టును జాతీయ పోర్టుగా ప్రకటించాలి : ఒంగోలు ఎంపీ మాగుంట

478
0

– రామాయపట్నం పోర్టు,
– కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్
– రెండు నిర్మాణానికి నిధుల ప్రతిపాదనలు
– సిద్ధం చేసినందుకు మాగుంట కృతజ్ఞతలు
ఒంగోలు (దమ్ము) : రామాయపట్నం పోర్టును జాతీయ పోర్టుగా ప్రకటించాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కేంద్ర తీరప్రాంత అభివృద్ధి శాఖ మంత్రిని కోరారు. సాగర్ సమృద్ధి యోజన అభివృద్ధిపై జరిగిన వెబ్నార్ లో మాగుంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్ సమృద్ధి యోజన పథకాన్ని ఏపీలో అమలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టుకి (3,736 కోట్లు), లైట్ హౌస్ కి (1.5 కోట్లు), కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్ కి (325 కోట్లు), పాసింజర్ జెట్టికి (1.5) నిధులతో మొత్తం 4,124.5 కోట్ల కేటాయింపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోని తీర ప్రాంతం ప్రకాశం జిల్లాలోనే ఎక్కువగా 84 కిలోమీటర్లు ఉందన్నారు. గత ప్రభుత్వం ఈ తీర ప్రాంత అభివృద్ధికి ఏమి చేయలేక పోయిందని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీర ప్రాంత అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం 2014లో దుగ్గరాజపట్నం అభివృద్ధి చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల అప్పుడు చేయలేకపోయిందన్నారు. రామాయపట్నం రాష్ట్రానికి మధ్యలో అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉందని ఉత్తర, దక్షిణ రాష్ట్రాల నుండి సరుకుల రవాణాకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ పోర్టు ఎంతో దోహదపడుతుందన్నారు. అందుకనే ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు ఎంతో పట్టుదలగా ఉన్నారన్నారు.

ఇప్పటికే రాష్ట్రం నుండి కొంత నిధులు కూడా విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవున్నారు. కేంద్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పోర్టును జాతీయ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని కోరారు. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఈపాటికే రాష్ట్రంలోని తీర ప్రాంతంలో కాగితం, ఇనుము కంపెనీలు రావడం జరిగిందన్నారు. ఇక్కడ పర్యాటకం కోసమే కాకుండా వ్యాపారపరంగా కూడా అభివృద్ధి చేయవచ్చన్నారు. ఒంగోలు జిల్లా తీర ప్రాంత అభివృద్ధి గురించి పది ఏళ్ల క్రితమే పార్లమెంట్లో తాను చర్చించడం జరిగిందన్నారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువగా తీరప్రాంతం ఉందన్నారు. సరుకుల ఎగుమతులు దిగుమతుల పరంగా ఇక్కడ ఎంతో అనుకూల వాతావరణం ఉందన్నారు. బ్లాక్ గ్రానైట్, పొగాకు వ్యాపారాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయన్నారు. వీటన్నిటికీ రామాయపట్నం పోర్టు ఎంతో అవసరం అన్నారు. కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్ కోసం రూ.325కోట్లు నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం ఉందన్నారు. దీని అభివృద్ధి చాల ఏళ్ల నుండి వెనుకబడుతూనే ఉందన్నారు. ఏపీలో రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు.

నీటి మార్గం కూడా అభివృద్ధి చెందడానికి సహకారం అందించాలన్నారు. బకింగ్ హాం కెనాల్ తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు అభివృద్ధి చేయాలని కోరారు. దీనివల్ల కాకినాడ, పాండిచ్చేరి, చెన్నైకి సరుకుల ఎగుమతికి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఒంగోలు జిల్లాలో ఆక్వా, వ్యవసాయం అభివృద్ధి చెందివుందన్నారు. వైజాగ్ నుండి చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో బొగ్గు రవాణా చేసుకోవచ్చన్నారు. ఇవే కాకుండా ఇక్కడ ఎన్నో అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. వైజాగ్ నుండి చెన్నై కోస్టల్ కారిడార్ రోడ్డు (తీరప్రాంత రహదారి) ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చి ఉన్నదన్నారు. కాబట్టి త్వరగా తీరప్రాంత రహదారికి సంబంధించిన పనులు ప్రారంభించాలని కోరారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ బకింగ్ హోం కెనాల్ ను కేంద్ర బృందం వచ్చి సర్వే చేస్తారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించి ఒక నమూనాని తయారు చేసి నిర్మిద్దామన్నారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన కెనాల్ ను పునర్ నిర్మించడానికి తామూ ఎంతో ఉత్సాహంగా ఉన్నామన్నారు.