Home బాపట్ల ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

11
0

పర్చూరు (DN5 News): రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో పనిచేస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన జరిగింది. ప్రజలకు రైతులకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. గత ఐదేళ్లు అవస్థలు ఎదుర్కొన్న ప్రజలకు ఏ సమస్య లేకుండా ప్రభుత్వం అభివృద్ధిని వేగవంతం చేసిందన్నారు. ప్రజలకు చేసిన పనులు, దాని వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలన్నారు.

పామాయిల్ సాగు విస్తరణపై దృష్టి
పామాయిల్ సాగు 100 హెక్టార్ల వరకు విస్తరించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. రైతులకు అందుతున్న సబ్సిడీలు, దీర్ఘకాలిక లాభాలపై విస్తృతంగా ప్రచారం చేసి సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఆదాయ వృద్ధి కలిగే పంటలను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు.

మామిడి రైతులకు సాంకేతిక సహాయం అవసరం
కడవకుదురు, కొలలపూడి ప్రాంతాల్లో మామిడి తోటలు విస్తారంగా ఉన్నాయని గుర్తుచేసిన ఆయన ఆర్టికల్చర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట సంరక్షణ, అధిక దిగుబడిపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లకు మామిడి ఎగుమతులు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

అసంపూర్తి రహదారి పనులపై అసంతృప్తి
పిడుగురాళ్ల, ఓడరేవు జాతీయ రహదారి పనులు ఇంకా పూర్తికాకపోవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మిగిలిన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడే పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారు.

టోల్‌గేట్‌పై స్థానికుల అవగాహన కల్పించాలి
కారంచేడు, పర్చూరు మధ్య ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద స్థానిక ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టోల్ చార్జీలు, లోకల్ పాస్ విధానంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని చెప్పారు.

పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు
గతేడాది నిల్వలో ఉన్న నల్లబర్లి పొగాకును కొనుగోలు చేయడానికి కంపెనీలతో సమన్వయం చేసి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రైతు కష్టానికి సరైన ధర దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ డాక్టర్‌ వి వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, వేమూరు, బాపట్ల, చీరాల ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, వేగేశన నరేంద్ర వర్మరాజు, ఎంఎం కొండయ్య, ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, టి మాధవరావు పాల్గొన్నారు.