పంగులూరు : నల్లబర్లి పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ స్థానిక తహశీల్దారు కార్యాలయం ఎదుట రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబోయిన రంగారావు మాట్లాడుతూ నల్లబెర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేసే వరకు రైతులు పోరాటం కొనసాగించాలని కోరారు. కాలయాపన చేస్తే రైతులు దిగివచ్చి తక్కువ ధరకు పొగాకు ఇస్తారని కంపెనీలు పొగాకు కొనుగోలు చేయడం లేదని, అందుకు ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి కంపెనీల ద్వారానైనా కొనుగోలు చేయించాలని, లేకుంటే మార్కెట్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు మాట్లాడుతూ కంపెనీలు బర్లి పొగాకు కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతుందని అన్నారు. రైతులంతా ఐక్య పోరాటం చేయాలని, పోరాటం ద్వారానే కొనుగోలు చేయించాలని కోరారు. అనంతరం తహశీల్దారు సింగారావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాయిని వినోద్ బాబు, నాయకులు తలపనేని సుబ్బారావు, గుడిపాటి మల్లారెడ్డి, ఆదంసాహెబ్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.