వేమూరు (Vemuru) : రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, రైతు లందరికి టార్ఫాలిన్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం (CPM) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్, బి అగస్టీన్ కోరారు. భట్టిప్రోలు మండలం చావలి, కోడిపరు, పెనుమర్రు గ్రామాల్లో తుఫాన్ నేపథ్యంలో ఆయన రైతులను కలిసి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఫలితంగా వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రూ.1700 ఉంటే వ్యాపారులు రూ.1300 మాత్రమే కొంటున్నారని అన్నారు.
అధికారులు తేమ ఎక్కువగా ఉందని, మట్టి ఉందనే కారణాలతో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కొన్ని గ్రామాల్లో రైతుల పట్ల ఆర్బికె సిబ్బంది పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు, సమస్యలపై విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం నిబంధనలు సడలించైనా కొనుగోలు చేయాలని కోరారు. కలెక్టర్ చొరవ చూపి ధాన్యం వ్యాపారుల దోపిడీ అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.






