అమరావతి : అధికార, మిత్ర పక్షాల మధ్య వైసిపి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బుధవారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వల్లభనేని సాయిప్రసాద్ అభినందన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై ఆఖరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని మంత్రి పుల్లారావు చెప్పారు. అయినా అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చన్నారు.
రాష్ట్రంలో వైసిపితో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తేల్చిచెప్పారు. అవినీతి పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వారిని బిజెపి దగ్గరకు తీసుకోదన్నారు. కేంద్రం ఆదేశిస్తే ఒక్క క్షణం కూడా తాను మంత్రి పదవిలో కొనసాగనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, వైసిపిలు కలుస్తాయంటూ వస్తోన్న ప్రచారం నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎయిమ్స్ నిర్మాణానికి దశలవారీగా నిధులు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.