నెల్లూరు : నగర సమీపంలోని కాకుటూరులో మంగళవారం జరగనున్న రైతు భరోసా సభకు వచ్చేందుకు రైతులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కాకుటూరులో సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో వర్షాలు కురిసి రెండు పంటలు పండాయని గుర్తుచేశారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక వర్షాలు సమృద్ధిగా కురిశాయని, జిల్లాలో 100 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. ఇవి రెండు పంటలు పండేందుకు సరిపోతాయని, రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోందని పేర్కొన్నారు. అందుకే జగన్ సభకు వచ్చేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. రైతులకు ఎంతగానో ఉపకరించే రైతు భరోసా కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, అధికారులు చక్కగా చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సభకు రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నరసింహారావు, మల్లు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.