అమరావతి : విద్యార్థుల తల్లులు తమ వివరాలను వెబ్ పోర్టల్లో సరిచూసుకోవాలని పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. అమ్మ ఒడి పథకం అమలు తీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జగనన్న అమ్మ ఒడి పథకంపై అధికారులు కీలక ప్రకటన చేశారు. 2020-21 సంవత్సరానికి విద్యార్థుల తల్లులు తమ వివరాలను వెబ్ పోర్టల్లో సరిచూసుకోవాలని పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు అర్హులైన తల్లులు లేదా సంరక్షకులు తమ బ్యాంకు అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, రైస్ కార్డు నంబరు వంటి వివరాలను అమ్మ ఒడి వెబ్ పోర్టల్లో సరిచూసుకోవాలని సూచించారు.
ఒకవేళ బ్యాంకు వివరాలు, ఇతర అంశాల్లో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి సరిదిద్దుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులు వెంటనే ఈ వివరాలు సరిచూసుకోవాలని చిన వీరభద్రుడు కోరారు. వచ్చే నెలలో అమ్మ ఒడి రెండో విడత డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.. అందుకే అధికారులు వివరాలను చెక్ చేసుకోమని సూచిస్తున్నారు.