●టైమ్స్ నౌ సర్వే రిపోర్ట్..!!
●సర్వే ఫలితాలపై ప్రత్యేక కథనం.
ఏపీలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకొనేదెవరనేది ఆసక్తి కంగా మారుతోంది. బీజేపీ అంశం పైన స్పష్టత రాకపోయినా, టీడీపీ – జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పొత్తుతో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ సమయంలో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపైన ప్రఖ్యాత జాతీయ సంస్థ టైమ్స్ నౌ సర్వే నివేదికలు ప్రకటించింది. ఇందులో ఏపీలో ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి.
మరోసారి ఎన్డీఏకే అవకాశం:దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ హ్యాట్రిక్ విజయం ఖాయమని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీఏకు 296 నుంచి 326 వరకు వస్తాయని అంచనా వేసింది. ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని విశ్లేషించింది. బీజేపీ సొంతంగా 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని వివరించింది. కాంగ్రెస్ 62 నుంచి 80 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఇక, ఏపీలో 25 లోక్ సభ స్థానాల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే సంస్థ తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని తెలిపింది.
ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్
ఏప్రిల్లో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని ప్రకటించింది. తిరిగి, జూన్ 15- ఆగస్టు 12వ తేదీ మధ్య తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలోనూ అవే ఫలితాలు పునరావృత మయ్యాయని తెలిపింది. ఏప్రిల్లో జరిగిన సర్వే, తాజా సర్వే ఫలితాల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఆ తేడా జాతీయ స్థాయి ఫలితాల్లోనే కనిపించింది. ఏపీకి సంబంధించి గతంలో మాదిరిగానే 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందని తేలింది. కాగా, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు స్పష్టమవుతోంది.
ఓటింగ్ శాతంలో లెక్కలు ఇలా:
ఓట్ల శాతంలో వైసీపీకి 51.30 తో సగానికి పైగా ఓటింగ్ షేర్ సొంతం చేసుకుంటుందని అంచనా వేసింది. టీడీపీకి 36.20 శాతం, జనసేనకు 10.10 శాతం, బీజేపీకి 1.30 శాతం ఓటింగ్ షేర్ దక్కుతుందని వెల్లడించింది. గత కొద్ది నెలల కాలంలో పలు జాతీయ సర్వే సంస్థలు ఇవే తరహా అంచనాలను వెల్లడించాయి. వైసీపీ 18-21 వరకు లోక్ సభ స్థానాలు గెలుచుకుుంటుందని చెప్పుకొచ్చాయి. ఇప్పుడు తాజా సర్వే లోనూ టైమ్స్ నౌ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ఇదే సమయంలో లోక్ సభలో ప్రస్తుతం నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ తాజా అంచనాల మేరకు బీజేపీ, కాంగ్రెస్ తరువాత మూడో స్థానానికి చేరుకుటుందని సర్వేలో విశ్లేషించారు.
