వెబ్డెస్స్ : ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ టెన్త్ లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.
అయితే ప్రస్తుతం దేశంలో జనాభా పెరుగుతున్న నేపధ్యంలో జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వం పెంచుతోంది. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల సంఖ్య పెరుగుతుంది. పిల్లలకు చిన్నవయసు నుంచే నాణ్యమైన విద్య, ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అంగన్వాడీ కార్యకర్తల భర్తీ, అర్హతల విషయంలో ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కార్యకర్తల విద్యార్హత డిగ్రీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలని నిర్ణయించారు.
ఒడిశా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధన ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు వర్తించదని కేబినెట్ స్పష్టం చేసింది. గత నిబంధనల ప్రకారం నిర్ణయించిన అర్హతల ప్రకారమే వారందరూ కొనసాగుతారని వెల్లడించింది. కొత్త నియమాకాలకు డిగ్రీ క్వాలిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు తెలిపింది.
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ద్వారా ఆరేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్యం, పోషకాహారం, విద్య, సేవలను అందించే బాధ్యతలను అంగన్వాడీ కార్యకర్తలు నిర్వర్తిస్తారు.