• ఈనెల 28న 19 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
• సిఎం చంద్రబాబు ఆదేశాలతో మద్దతు ధర
• ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రకటన
పర్చూరు (DN5 News) : రాష్ట్రంలో శనగ రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సిఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Samba Shivarao) తెలిపారు. ఈనెల 28న నియోజకవర్గ వ్యాప్తంగా శనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు బుధవారం తెలిపారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పిఎసిఎస్ల ద్వారా 19 బెంగాల్ గ్రాం శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శనగలు క్వింటాకు రూ.5,875 కనీస మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో రైతులు మధ్యవర్తుల బారిన పడకుండా ప్రభుత్వ కేంద్రాల ద్వారా నేరుగా పంట విక్రయించుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
పారదర్శకంగా కొనుగోళ్లు
మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో నమోదు ప్రక్రియ సులభతరం చేయడం తోపాటు తూకం యంత్రాలు, గోదాముల సదుపాయాలు సిద్ధం చేశామని చెప్పారు. సీఎం యాప్లో నమోదు చేసుకున్న రైతుల నుంచే కొనుగోళ్లు చేపడతామని తెలిపారు.
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
తేమ శాతం, నాణ్యత ప్రమాణాల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కొనుగోలు అనంతరం చెల్లింపులు త్వరితగతిన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు దళారుల ప్రలోభాలకు లోనుకాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. అవసరమైతే 19 కేంద్రాలతో పాటు మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రైతు సీఎం యాప్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
నియోజకవర్గంలో 19 కేంద్రాల ఏర్పాటు
పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 19 శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్నగంజాం మండలం చింతగుంపల పిఎసిఎస్, సంతరావూరు పిఎసిఎస్, ఇంకొల్లు మండలం భీమవరం పిఎసిఎస్, ఇంకొల్లు పిఎసిఎస్, కొణికి పిఎసిఎస్, పావులూరు పిఎసిఎస్, కారంచేడు మండలం ఆదిపూడి పిఎసిఎస్, దగ్గుబాడు పిఎసిఎస్, నాయుడువారిపాలెం పిఎసిఎస్, కొడవలివారిపాలెం పిఎసిఎస్, మార్టూరు మండలం కోలలపూడి పిఎసిఎస్, యద్దనపూడి మండలం పూనూరు పిఎసిఎస్, పర్చూరు మండలం బోడవాడ, మందగుంట పిఎసిఎస్, నాగులపాలెం పిఎసిఎస్, నూతలపాడు పిఎసిఎస్, రమణయ్య పాలెం పిఎసిఎస్, వీరన్నపాలెం పిఎసిఎస్, పోతుకట్ల పిఎసిఎస్, పర్చూరు పిఎసిఎస్లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.






