పర్చూరు : 47 సంవత్సరాలుగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. సమైక్యాంధ్రలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా, నవ్యాంధ్రలో ఆరో సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని సిఎం చంద్రబాబు అన్నారు. ఇది తనకు ప్రజలిచ్చిన అరుదైన గౌరవం అన్నారు. ఏ నాయకుడికి ఈ అవకాశం దొరకలేదని అన్నారు. పేదరికం లేని సమాజమే తన ఆశయం అన్నారు. సంపద కొందరికే పరిమితం కాకూడదు. ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందినప్పుడు సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగానే పీ4 కార్యక్రమం రూపొందించాం. సమాజంలో ఉన్నతంగా ఉన్న 10 శాతం సంపన్న వర్గాలు సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేద కుటుంబాలను ఆదుకుని వారి అభ్యున్నతి కొరకు స్వచ్ఛందంగా ముందుకురావాలి. పేద కుటుంబాలను ఆదుకునే వారు మార్గదర్శిగా, ఆదుకోబడిన వారు బంగారు కుటుంబంగా పరిగణించబడతారు. ఎన్టీఆర్, అంబేద్కర్, అబ్దుల్ కలాం సహా ఎవరూ పుట్టుకతోనే గొప్పవారిగా పుట్టలేదు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని మహోన్నత వ్యక్తులుగా ఎదిగారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు, పింఛను, మంచి నీటి కుళాయి, కరెంటు, మరుగుదొడ్లు, డ్రైనేజ్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తాం.