కందుకూరు : హేతుబద్దత లేని విభజన వలన ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల నష్ట పోయిందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టిడిపి శిక్షణా శిభిరం డైరెక్టర్ దాసరి రాజామాస్టారు పేర్కొన్నారు. తెలుగుజాతికి అన్యాయం జరిగితే ఊరుకోమని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. 152వ బ్యాచ్ శిక్షణ ప్రారంభ సభకు అధ్యక్షత వహించారు. తొలుత పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. రాజా మాష్టారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా న్యాయం చేయాలని కోరారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. అందరి సహకారం తోనే రాష్ట్ర హక్కులను సాదించు కోవచ్చన్నారు. ఆ రోజు ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నిరుత్సాహ పడితే ఏమి చేయలేమన్నారు.
హక్కుల కోసం ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తెలుగుజాతికి అన్యాయం జరిగితే ఎలాంటి త్యాగానికైనా సిద్దమేనని స్పష్టం చేసారు. చేయని తప్పుకు రాష్ట్ర ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. విభజన హేతు బద్దంగా జరిగి ఉంటె ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. విభజన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రుపుకోలేకపోతున్నామన్నారు. నవ నిర్మాణ దీక్ష చేస్తున్నామని, ఇటువంటి కీలక సమయం లో కొందరు తమ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐదు కోట్ల ప్రజలకు న్యాయం చేసేవిధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే హామీలను నెరవేర్చాలన్నారు . శిక్షణకు గుంటూరు జిల్లా తెనాలి, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరి, సూళ్ళురుపేట, వేంకటగిరి, గూడూరు నియోజక వర్గ గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ కాకర్ల మల్లిఖార్జున్, శిక్షకులు పాపారావు పసుపులేటి, చైతన్య, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు .