Home బాపట్ల ఆటలతో విద్యార్దుల్లో మనసిక ఆరోగ్యం : కలెక్టర్ వినోద్ కుమార్

ఆటలతో విద్యార్దుల్లో మనసిక ఆరోగ్యం : కలెక్టర్ వినోద్ కుమార్

23
0

బాపట్ల (Bapatla) : విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడాలంటే తప్పనిసరిగా క్రీడలు నిర్వహిస్తూ, తరగతి గదులలో సమానత్వం పాటించాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. మానసిక ఆరోగ్యంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం జరిగింది.

విద్యార్థుల్లో సమానత్వం, ఐక్యతపై అవగాహన కల్పించాలని చెప్పారు. భవిష్యత్తు సమాజ నిర్మాణం తరగతి గదులలోనే ప్రారంభం అవుతుందనే విషయాలను అధికారులు గుర్తించాలని అన్నారు. విద్యార్థులను చిన్నచూపు చూడరాదని అన్నారు. భేదాభిప్రాయాలకు తావులేకుండా ప్రతి విద్యార్థితో ఉపాధ్యాయులు చక్కగా ప్రవర్తించాలన్నారు. 6.7 శాతం విద్యాసంస్థల్లోనే ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయని వివరించారు.

రేపటి భావి భారత పౌరులను చక్కగా తీర్చి దిద్దాళ్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. విద్యార్థుల్లో మానసిక స్థితి మెరుగుపరచాలని, మానసికస్ధైర్యాన్ని వృద్ధి చేయాలన్నారు. ఇందు కొరకు పాఠశాల, కళాశాల, కోచింగ్ సెంటర్లలో వందమంది విద్యార్థులు దాటితే తప్పనిసరిగా ఒక సైకియార్టిస్ట్ ఉండాలన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ నైతిక విలువలను పెంపొందించాలన్నారు.

మానసిక ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, పాటించాల్సిన నిబంధనలపై ప్రతి విద్యా సంస్థకు వాటి ప్రతులను పంపాలన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పూర్తిగా అరికట్టాలని అన్నారు. ప్రతి విద్యార్థి సంస్థలో ఫిర్యాదుల బాక్స్ విధిగా ఉంచాలని, ప్రతి రెండవ సోమవారం నాలుగవ సోమవారం వాటిని అధికారులు తెరిచి చూడాలన్నారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే వాటిపై తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలన్నారు.

మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు, ఆత్మహత్య ఆలోచన వచ్చే విద్యార్థుల కొరకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 14416 టెలిమానస్ ను ఏర్పాటు చేసిందని చెప్పారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులు ఎవరైనా ఈ నెంబర్ కు కాల్ చేయవచ్చన్నారు. 24 గంటల పాటు టెలి మానస్ పనిచేస్తుందన్నారు.

జిల్లాలోని 19 డిగ్రీ కళాశాలలు, 184 జూనియర్ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలలోనూ వీటిని నోటీస్ బోర్డ్ లో ఉంచాలన్నారు. విద్యార్థులకు ఉచితంగా ఈ సేవలు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉన్నాయని అవగాహన కల్పించాలన్నారు. డిసెంబర్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.

కర్మ యోగి ద్వారా ఆన్ లైన్ తరగతులు వినేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అవగాహన కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదాని ఎంఈఒలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు. ఉపాధ్యాయులు ఒక గంట సామాజిక అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ జుబేర్, కమిటీలోని అధికారులు పాల్గొన్నారు.