– చీరాలలో దుగ్గిరాల స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలి
– చీరాలలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలు
చీరాల : 75వసంతాల స్వాతంత్య్ర వేడుకల్లో చీరాల – పేరాల ఉద్యమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు సర్విసెట్టి సుబ్బరామయ్య నేతృత్వంలో సమితి ప్రతినిధులు మంగళవారం దుగ్గిరాల గోపాల కృష్ణయ్య 132వ జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్విసెట్టి సుబ్బరామయ్య మాట్లాడుతూ 1921లో ఏప్రిల్ 25న చీరాల, పేరాల ప్రాంతాన్ని ఖాళీ చేసి దూరంగా రామనగర్లో పాకలు వేసుకుని ఉంటూ నాటి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఘటనలను గుర్తుచేసుకున్నారు. అంతటి మహోద్యమానికి నూరేళ్లు నిండినాయన్నారు. ఉధ్యమానికి తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
చీరాల జిల్లా సాధన జెఎసి ఛైర్మన్ తాడివలస దేవరాజు మాట్లాడుతు చీరాల పేరు చెబితే చీరాల – పేరాల ఉధ్యమం గుర్తుకు వస్తుందన్నారు. ఈ ఉధ్యమం జాతీయస్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా మహాత్మాగాంధీ దృష్టిని ఆకర్షించిందన్నారు. ఆ స్పూర్తితో మహాత్మాగాంధీ, డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ వంటి మహానేతలు ఈ ప్రాంతంలో పర్యటించారని అన్నారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన నేల చీరాల ప్రాంతమన్నారు. అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఉద్యమం భావి తరాలకి స్ఫూర్తి ఇవ్వాలంటే దుగ్గిరాల పేరు మీద స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. చీరాల – పేరాల ఉద్యమానికి నేటితో వంద సంవత్సరాలు అయిందని, నాటి ఆ ఉద్యమ చరిత్ర నేటి యువత తెలుసుకుని స్ఫూర్తి పొందాలని అన్నారు.
కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రావూరి వెంకటేశ్వర్లు, జిఎవి ప్రసాద్, ఉపాధ్యాయులు పవని భానుచంద్రమూర్తి, ఎంఎస్ ప్రసాదరావు, కె కామేశ్వరశర్మ పాల్గొన్నారు.